నేటి బాల్యం( బాలల దినోత్సవం సందర్భంగా )
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
వ్యాసకర్త: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
పరమాత్ముని స్వరూపులైన పసిడి బొమ్మలాంటి చిన్నారుల బాల్యం నేటి సమాజంలో నిజంగా ఎంతవరకు సక్రమంగా జరుగుతున్నది. ప్రతివారు బాల్యం బంగరుమయం అని అంటున్నారు. అది నేటి సమాజాన ఎంతవరకు సమంజసం. యుక్తా యుక్త విచక్షణతో పరిశీలించి చూస్తే అర్ధమవుతుంది. యాంత్రిక జీవనంలో ధనార్జనే ధ్యేయంగా ధనవంతులు, మధ్య తరగతి వారు తమ పసిడి మొగ్గలాంటి నెలల పిల్లలని పిల్లల ఆశ్రమం( ఛైల్డ్ కేర్ సెంటర్) లో ఉదయం ఎనిమిది గంటలకే పెట్టి అమ్మ పాలు లేక బుడ్డి పాలతో పెరుగుతున్నారు. ఖరీదైన బట్టలు, బొమ్మలు ఇచ్చి, అవసరమైతే తాహతుకుమించి వస్తువులను ఇచ్చి సుమతీ, వేమన శతకాలు రామాయణ, భారత గాధలను చెప్పే తాతయ్య, నానమ్మల పెంపకం ఇంగ్లీష్ చదువులకు ఆటంకమని దరిచేరనీయక అనురాగ ఆప్యాయతలకు దూరం అవుతున్నారు. ఇది నాణేనికి ఒకవైపు బాలల పరిస్థితి. ఇక రెండో వైపు నాణేనికి తల్లి, తండ్రి ఎవరో తెలియక అనాధలుగా రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో, వయస్సుకి మించిన భారాన్ని మోస్తు, టీ దుకాణాలలో కప్పులు కడుగుతు చినిగిన దుస్తులతో, చీదరింపు మాటలతో మృగాలకన్నా హీనంగా బతుకుతు, గుప్పెడు పొట్ట నిండుటకు పడరాని పాట్లు పడుతున్న అభాగ్యులు బాలికలయితే, యజమానుల చేసే ఆరాచాకాలను చెప్పుకోలేని పరిస్థితులు. ఇవన్నీ చూస్తుంటే బాలలకార్మిక చట్టాలు మాటలకే పరిమితమా? నెహ్రూ చాచా చెప్పిన లేత గులాబీలలాంటి బాలలు వీరేనా. అసలు బంగరు బాల్యం కలయేనా? ఒకసారి విజ్ఞత గలవారు ఆలోచించండి..!