అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..
ఓ వరం
రచన: విస్సాప్రగడ పద్మావతి
అదొక అందమైన హరివిల్లు లాంటి చిన్న పల్లెటూరు. వినయ విధేయతల్లో మేటి. చదువు సంధ్యల్లో సాటి ఎవరూ లేరు. ఇది కావాలి అని అడగక ముందే అన్నీ అమర్చిన అమ్మానాన్నలతో ,అక్క, అన్న లతో రోజులు హాయిగా గడిచి పోయాలి.
డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న సమయంలో పరిచయమయ్యాడు దూరపు బంధువు పార్ధూ.. మాటా మాటా పెరిగి, బంధుత్వం బలపడి, కుండబద్దలు కొట్టినట్లు ఒకనాడు మనసులో మాట వెలిబుచ్చాడు పార్దూ.. మనసులు కలిసిన వేళ కాదనలేకపోయింది స్వాతి. ప్రతి రోజు ఫోన్ చేసి మాట్లాడే పార్ధు రెండు నెలల తర్వాత ఫోన్ మూగపోయింది, మాట కరువయ్యింది ,ఏమైందో తెలియదు ఫోన్ చేస్తే మాట్లాడటం తప్ప పూర్తి వివరాలు తెలుసుకోవడం లో ఫెయిల్ అయింది స్వాతి. ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేక బరువెక్కిన గుండెతో డిగ్రీ అయిందనిపించింది.
ఒకనాడు మంచి సంబంధం అని పెళ్ళి కుదిర్చి చేసేసారు. మనసులోతుల్లో పుట్టిన ప్రేమ, గుండె లోతుల్లోనే దాగిపోయింది. విషయం చెప్పలేక వేరే వ్యక్తితో బతుకు పంచుకోలేక సతమతమవుతూ 20 సంవత్సరాలు గడిపింది. సంవత్సరాలు చలిచీమల్లా పాకుతూ పోతున్నా ఎలాగైనా చూడాలి ఒకసారైనా కలవాలి అనే ఎదురు చూపు మాత్రం చావలేదు.
20 సంవత్సరాల తర్వాత తనతో పాటు చిన్నప్పటినుంచి చదువుకున్న సన్నిహితుడు ఆత్మీయుడితో మొదటిసారి నోరు విప్పి చెప్పింది. పేరు తప్ప వివరాలు ఏమీ తెలియవు. అయినా ప్రయత్నిస్తా అని మనసు కుదుటపరచి వేట మొదలెట్టాడు.
ఎప్పటిలా సోమవారం గుడికి వెళ్లి అలవాటుగా తన ఎదలోతుల్లో దాగి పోయిన వ్యధను శివుని ముందు పరిచింది. ఇన్ని సంవత్సరాల తర్వాత శివయ్య తన ఆవేదన అర్థం చేసుకున్నాడో ఏమో దర్శనం చేసుకొని వస్తుంటే టెంకాయ కొడుతూ కనిపించాడు పార్థూ.. ఎప్పుడో ఒకసారి చూసిన స్వాతి అవునా కాదా అనే సందిగ్ధంలో నిచ్చేష్టు రాలై చూస్తూ ఉండిపోయింది. పార్ధు చూసి దగ్గరకు వచ్చి బాగున్నావా అని పలకరిస్తుంటే మనసు మూగబోయింది. కళ్ళ ముందు జరిగేది కలో నిజమో అర్ధం కాక ఆనందాశ్చర్యాలతో మునిగి గుండె వేగం పెరిగింది.
ఊపిరి బిగబట్టి శక్తిని కూడగట్టి సూటిగా ప్రశ్నించింది.ఎందుకు వదిలేసావు అని. దానికి సమాధానంగా పెళ్లి చేసుకోవాలని ఎంతో ప్రయత్నించి విఫలమయ్యానని, సరైన చదువు ఉద్యోగం లేదనే కారణంతో నీకు ఇష్టం లేదని చెప్పి.. మీ వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదు. ఇవేమీ తెలియని స్వాతి అతని జవాబుకు నివ్వెరపోయింది. ఇంత జరిగిందా అని అయోమయంలో పడిపోయింది. నిజంగానే నీకు ఇష్టం లేదేమో అని, నిన్ను ఇబ్బంది పెట్టడం దేనికని దూరంగా ఉండి పోయాను అని పార్ధు చెప్తుంటే కళ్ళలోగిళ్ళలో ఊపిరాడని అలల పోరాటం ఏరై ప్రవహించింది.
కొంతసేపటికి తేరుకుని ఇప్పటికైనా శివయ్య దయవల్ల కలిశామని.. సంతోషంతో ఎవరి బాధ్యతల్లో వాళ్లు మునిగిపోయారు.. ఎప్పటిలా స్వాతి నిర్జీవంగా కాక ఆనందంగా జీవితాన్ని కొనసాగించింది.