(అంశం: హాస్యకథలు)
పార్వతమ్మ గారి పరమేశ్వరం పెళ్ళి
రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఒరే పరమేశం వంటిమీదకి ముప్పైఏళ్ళు వచ్చాయి. పెళ్ళి చూసుకోరా అంటే చేసుకోవు.అన్నీ సమకూర్చుకునే వరకు పెళ్లేమిటే బామ్మ అంటావు. చేస్తున్నారా నీతో మీ నాన్న అమ్మ నిన్ను నన్ను చూసుకోమని వారిమానాన వారు శ్రీరామచంద్రుని సన్నిధి చేరుకున్నారు. బతికున్నాక నాకు తప్పదు కదా .నేను ఎనభై పడిలో ఉన్నాను.రేపు ఎలా ఉంటానో ఏమో నీకు పెళ్ళి చేసి నా భాద్యత తీర్చుకోవాలి. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా ఎందుకు పనికిరారు.అప్పుడు నీకు పిల్లనిస్తామని ఎవరు రారు నా మాట వినరా అని పౌత్రుడు పరమేశం అనే ఈశ్వర్ గురించి అంటూ ఉండగానే మెల్లిగా తనగది లోకి బామ్మ గోల ఇంతే రోజు అనుకుంటు జారుకున్నాడు.
పొద్దున్న లేస్తు కాఫీ అందిస్తున్న పార్వతమ్మ గారితో మనవడు పరమేశం బామ్మ పూజ దేవుని ధ్యాస మాని నా పెళ్ళి గొడవ ఎక్కువయిందే నీకు అన్నాడు. అదికాదురా నీ తోటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలనెత్తారు. నువ్వేమో పిల్ల నల్లగా ఉందని,పళ్ళు ఎత్తని, ఎత్తులేదు, చదువుసరిపోదని వంకలు పెడుతున్నావు.సర్దుకుపోవాలి. అన్నీ ఎంచితే ప్రపంచంలో ఎవరికి పెళ్లిళ్ళు కావురా. సంప్రదాయం, కుటుంబం చూసి పెద్దవాళ్ళు పెళ్ళి చేస్తే మా రోజుల్లో ఆందరు చేసుకునే వాళ్ళు. ఇప్పడు ఏం చదువులో ఆడ,మగ వారిష్టం వచ్చినట్లు ముపై ఏళ్ళు దాటాక పెళ్ళి చేసుకుని నలభై సంవత్సరాలకి పిల్లలని కంటే ఎప్పుడు జీవితంలో బాధ్యత వదలించుకుంటారు అని అంటూ వంటిట్లో కి వెళ్లిపోయారు.
ఎట్టకేలకు పరమేశానికి కరోనా కాలంలో పెళ్ళి నిశ్చయమయింది. పార్వతమ్మ సంతోషంగా ఒరే పరమేశం నీ పెళ్ళి వైభవంగా బంధువులని,స్నేహితులని పిలచి చేద్దాం మనకేమి తక్కువ అన్నారు. వెంటనే బామ్మతో ఇది కరోనా కాలం పెళ్ళి కి ఏభై మందినే అనుమతిస్తారు అంటే అదేమిట్రా వంటవాళ్ళు, సన్నాయివాళ్ళు, వీడియో వాళ్ళు కలిపే పదిహేను మంది, నీ స్నేహితులు ఇరవై మంది, మేనత్త, మేనమామ, మాచెల్లి, పిల్లలు, మనవలు,దగ్గరబంధువులే వందపైన ఎలారా అన్నారు పార్వతమ్మ .
వెంటనే పరమేశం నేను స్నేహితులను పిలవను మామయ్య, అత్త చిన్నప్పటి నుంచి చూసారు ఊళ్ళో ఉన్నారు అలాగే మేనత్త ని మనవేపుపదిమంది, వాళ్ళ వేపు పదిమంది తోనే పెళ్ళి విశాలమైన నోవా కళ్యాణమండపంలోనే అన్నాడు. ఇన్నాళ్ళు పెళ్ళి, పెళ్ళి అన్నావు ఇప్పుడు కరోనా కాలంలో పెళ్ళి కుదిరిందే నువ్వుండగానే చేసుకుంటున్నాను అన్న మనవడితో ఏమిటో మూతికి గుడ్డలు కట్టుకొని, చేతులకు అస్తమాటు వ్రాసుకుంటు భయం, భయంగా పెళ్ళి ఏమిటో పోనీలే నే బతికుండగానే
నే పెళ్ళి చూస్తున్నా కళ్ళకు కూడా గుడ్డలు కట్టుకోమన లేదు నయం అంటు పరమేశానికి మొత్తం మీద పెళ్ళి జరిపించి ఏదో మమ అనిపించినా మనవడి పెళ్ళి జరిగినందుకు వెంకన్న మొక్కు కరోనా తగ్గిన తరువాత నవ దంపతులతోకూడ వెళ్ళి తీర్చారు పార్వతమ్మ గారు.
***