(అంశం:”సంధ్య వేళలో”)
తన్మయత్వము
రచన: సావిత్రి కోవూరు
ఆహ్లాద సంధ్యారుణ వేళలలో అరుదెంచెనదిగో శశి కాంతులీనుతూ,
శశి కిరణములే స్వర్ణ పోగులై పుడమిని ప్రసరించగా పుడమి తల్లి పులికితమై పరవశించెగా,
వృక్ష రాజములు కిరణముల పొదిమి భువిపై రంగవల్లులు తీర్చగా,
ఆహ్లాదముతో ఆనందముతో ఆహ్వానించెను అరులు చాచి అలలతో అంబువులను పన్నీరుగా చిలకరించుచూ
రత్నగర్భుడే రేరాజు రాకకై తహతహ లాడుతు, తరితరి చూచుచు, తన తనయుని తడుము ఉత్సుకతతో,
ముక్త ప్రవాళులను శ్వేతారుణ సుమముల వెదజల్లుచు స్వాగత గీతములాలపించగ,
మిలమిల మెరియుచు తళతళ లాడుతూ సైకత రాశులే స్వర్ణపు కాంతులు వెదజల్లుతూ,
మిరుమిట్లు గొలుపగా, పవన వీచికలు పలు విరుల తావులను గొని వడివడిగా కడలి తీరమున సుగంధములు నింపగా,
దివియే భువికి చేరెనను భ్రాంతితో చిత్తరువునై, తన్మయత్వమున, తనివి తీరక, తీరము వీడ ఇచ్చగించక,
ఇసుక తిన్నెల వ్రాలెను నా తనూలత శశిని, తారల గాంచుచు, ఆ సంధ్య వేళలలో,
స్వర్గమును కంటిని ముదముతో, శశి జ్యోత్స్నల తానమాడుతూ తరులుట మరచి.