ఊబి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
సమీక్షకులు: చంద్రకళ. దీకొండ
కథ: ఊబి
రచన: సావిత్రి. కోవూరు
అనగనగా కథలంటే అందరికీ ఆసక్తే. కథా లోకంలోకి తీసుకెళ్లే ఎత్తుగడతో మొదలుపెట్టి,
ఊ…కొడుతూ వినేలా, తరువాత ఏమౌతుందో అని ఉత్కంఠ కలిగేలా,కూతూహలం కలిగించే లక్షణాలు కథకు అవసరమే అయినా…నిత్యజీవిత సమస్యలు(ముఖ్యంగా అతివలవి),వాటి పరిష్కారాలు సూచించి,చదివేవారిని అప్రమత్తపరిచేలా ఉండే సందేశాత్మక కథలూ మోసపూరితమైన నేటి కాలంలో ఎంతో ఆవశ్యకం.
అటువంటి కథే సావిత్రి గారు రచించిన ఈ కథ.
“వెయ్యి అబద్ధాలాడైనా ఒక్క పెళ్లి చేయాలి”అన్న సామెతను నిజం చేసేలా…బ్యాంకులో ఉద్యోగమని చెప్పి కట్నం భారీగా తీసుకుని,ఒక్క నగా పెట్టకుండా…ఆమె సంపాదనపైనే ఆధారపడి, తాను జల్సాలు చేస్తూ, తన నగలను తాకట్టు పెట్టి, ఆమెకు తెలియకుండా తల్లీకొడుకులు కలిసి ప్లాట్ కొనడమే కాక… పిల్లలు పుట్టకుండా పాలల్లో మాత్రలు కలపడం…ఎంత దారుణం…!
కథలో అమ్మ కూతురికి సపోర్ట్ చేస్తుంది. కానీ ఇలాంటి పెళ్లి ఊబి లో దిగబడి బయటకు రాలేని ఎందరో అతివలకు ప్రతిరూపం ఈ కథలో కథానాయిక.
చివరికి ఇంకో అమ్మాయిని ముందుగానే వివాహం చేసుకుని తనకు నమ్మకద్రోహం చేసాడని తెలుసుకుని… చాటుగా ఫోటో తీసి, మళ్లీ ఇంకో పెళ్లి చేసుకుని మరో అమ్మాయిని బలి కానివ్వకుండా, విడాకులు తీసుకోకుండా విడిగా అమ్మతో ఉంటూ అతని ఆటలు కట్టిస్తుంది. భర్త మాటలను అమాయకంగా నమ్మవద్దని, స్త్రీకి సాధికారత ఉన్నా, దాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటారని, అతివలు అప్రమత్తంగా ఉండాలని సందేశాన్నిచ్చే చక్కని కథ అందించిన సావిత్రి గారికి అభినందనలు
ముందు ముందు మరింత చిక్కని కథనంతో సామాజిక స్పృహ కలిగిన కథలు వ్రాయాలని ఆశిస్తూ…