విధిరాత
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: శారద కెంచం
అనగనగా ఒక జ్యోతిష్కుడు. ఒకసారి అతడు పొరుగూరుకు వెళుతూ ఒక ఇంటి దగ్గర ఆగాడు. ఆ ఇంటి యజమానిని పిలిచి “ఈ రోజు మీ ఇంటిలో ఒక చావు రాసిపెట్టి ఉంది అని చెబుతాడు”. ఆ యజమానికి జ్యోతిష్కుల గురించి ముందే తెలుసు. అతడు చెప్పింది ఇంతవరకు పొల్లు పోకుండా జరిగింది. అందుకే ఎలాగైనా తన కుటుంబాన్ని కాపాడుకోవాలని తలచి వెంటనే పొరుగూరు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. దారిలో అతని భార్య , ” ఏమండీ! మనం ఊరికి వెళుతున్న విషయం మామగారికి చెప్పలేదు కదా! ఒకవేళ ఆయన రోజులాగానే ఈరోజు కూడా మన ఇంటికి వస్తే ఎలాగా?” అని అడిగింది. అందుకు భర్త ఏమి పరవాలేదు. ఇల్లు తాళం వేసి ఉంటుంది గనుక ఆయన తిరిగి తన ఇంటికి వెళ్లి పోతారులే.
నువ్వు కంగారు పడకు అని చెబుతాడు. నిజమేలెండి ఇల్లు తాళం వేసి ఉంది. ఉంటే ఆయన మాత్రం అక్కడ ఉండి ఏం చేస్తారు నా పిచ్చి కాకపోతేను అంది తనను తను నిందించుకుంటూ. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ ఆ పెద్దాయన రోజూలానే ఆ రోజు కూడా తన కొడుకు, కోడలిని మనవళ్ళను చూడాలని వచ్చాడు. ఇల్లు బారగ తెరిచి ఉండటం చూసి, ఏమై వుటుందా? అని కంగారుగా లోనికి వెళ్ళాడు. అక్కడ దొంగలు నగలు, డబ్బు దోచుకోవడం చూసి వారిని ఎదురుకునే ప్రయత్నంలో అక్కడికక్కడే కన్నుమూశాడు. తండ్రి మరణ వార్త విన్న కొడుకు కుమిలిపోయాడు. విధి ఇలా ఉండగా వేరేలా ఎలా జరుగుతుంది అని దుఖించాడు. విధిరాతను ఎవరు మాత్రం తప్పించగలరు చెప్పండి?