(అంశం : “మానవత్వం”)
బాటసారి ముగ్గురు దొంగలు
రచన: కవితదాస్యం
ఒకసారి ఓ వ్యక్తి అడవిలో ప్రయాణిస్తున్నాడు. దార్లో ముగ్గురు దొంగలు, అతడి వద్ద ఉన్నవన్నీ దోచుకున్నారు.
ఒకతను ఇలా అన్నాడు వీడిన ప్రాణాలతో వదిలేయడం మంచిది కాదు. రేపెప్పుడైనా మనల్ని గుర్తుపట్టి ప్రభుత్వానికి అప్పగించవచ్చు. అందుకే వీడ్నీ చంపేస్తే పోతుంది అని బాటసారిని చాకుతో పోడవబోయాడు.
రెండవ దొంగ అతడ్ని ఆపాడు. మన పని దోచుకోవడమే కానీ చంపడం కాదు. అనవసరంగా వీడిని చంపిన పాపం మనకెందుకు? గుర్తుపట్టి ప్రభుత్వానికి అప్పగిస్తారని భయపడి అందర్నీ చంపుతూ పోవడమేనా మన పని. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది.
మనం ఈ అడవి నుండి బయటపడే లోగా వీడు మనల్ని పట్టించుకోకుండా ఉంటే చాలు. అందుకని విడి కాళ్లు చేతులు కట్టిపడేద్దాం అన్నాడు. మొదటి దొంగ సరేనన్నాడు.
ఇద్దరు కలిసి అతన్ని కట్టిపడేసారు. మూడవ దొంగకు అది కూడా నచ్చలేదు. మిగిలిన ఇద్దరి తో కలిసినట్టే వెళ్లి వెనక్కి వచ్చాడు. బాటసారిని చూచి అయ్యో.. నీన్నెంతగా హింసించాము. సరే నీ కట్లు విప్పేస్తాను. మీ ఇంటికి త్వరగా క్షేమంగా వెళ్ళిపోవచ్చు. అని కట్లు విప్పాడు.
అంతటితో ఆగకుండా ఈ అడవిలో ఇంకా దొంగలుండవచ్చు. నీ వద్ద దోచుకునేటందుకు ఏమీ లేవు ఆ కోపంలో నిన్ను చంపిన చంపవచ్చు. అందుకని జనం తిరిగే రహదారిలో వెళ్లే వరకు నేనూ నీతో వస్తాను. పదా. బయలుదేరు అన్నాడు.
బాటసారి దొంగ మంచితనానికి ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ కొంతసేపటికి రహదారి చేరుకున్నారు. అప్పుడు బాటసారి దొంగతో అన్నాడు. అయ్యా..! మీరు ఎంతో మంచివారి లాగున్నారు. మీరు చేసిన సహాయానికి మిమ్మల్ని ఇలా పోనివ్వలేను. దయచేసి నా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అంటూ ప్రాధేయపడి బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లాడు.
దొంగ భోజనం చేస్తుండగా బాటసారి వెనుకనుండి ఓ దుడ్డు కర్రతో తల మీద గట్టిగా బాదాడు. దొంగ తల పట్టుకుని అబ్బా అని క్రిందపడి పోగానే ఇరుగు పొరుగు వారిని కేకేసి దొంగను వారికి అప్పగించాడు బాటసారి.
నీతి:
దానవుల్లో మానవత్వం ఉన్నట్లే మానవుల్లో కూడా బాటసారి లాంటి దానవులు కూడా ఉంటారు.