మనిషి-మనసు
రచయిత: జ్యోతిరాణి(జో)
ఒక్కొక్కసారి బంధాలు
త్రుంచితే విడిపోయేంత
పలుచగా మారి
సహనాన్ని పరీక్షించి
ఎన్నో గుణపాఠాలను
కళ్ల ముందర కదలాడుస్తూ
కాలగమనంలో నడిపిస్తుంది..
నరంలేని నాలుక కూడా
పదునైన అస్త్రాలను
గుండెలో గుచ్చేలాచేసి
మనసుని కాకవికలం చేసి
ఎదుటివ్యక్తి బాధలో
నవ్వులను వెతుకుతుంది..
మనిషి అనే ముసుగులో
పైకి నవ్వులు విసురుతూ
నిండా కోపం అసూయ
కనుపొరలమాటున దాచేస్తూ
తన జీవిత రంగస్థలంలో
మంచితనం అనే ముసుగు
నాటకాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు..
జీవితపయనంలో మనుషుల
మనోభావాలను బాధపెడుతూ
పెత్తనం చేలాయించే మనుషులు
ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే
పలకరించే మాట కూడా ఉండదేమో..
మాటలతూటాలు విసిరేముందు
విలపించిన మనసు బాధ
మనిషిని మనిషిగా చూడని
నీ మనసుకేమి తెలుసు
ఎదుటివారి మనసు విలువ..
జారిపోయిన మాట వెనుకకు
పోయిన నమ్మకాన్ని వెనుకకు
ఎప్పుడు తీసుకరాలేము
మాట్లాడే నాలుగు మాటలు
ఇతరుల ఆనందానికి
కారణం అవుదామ మరి..