మూడుతరాలు
రచన: శృంగవరపు శాంతికుమారి
“శృంగిభేరి” పురాన్ని “శతాంశునుడు” అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. గొప్ప పరిపాలనాదక్షుడు. ధర్మ పరాయణుడు. ప్రజలకు ఎలాంటి ఈతి బాధలు లేకుండా, ప్రజలందరిని సమానదృష్టితో చూస్తూ…. రాజ్యంలోని ప్రతీ సమస్యను పరిష్కరిస్తూ….. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ….. ప్రజానురంజకంగా పాలించేవాడు.
“యథా రాజా తథా ప్రజాః ప్రజలందరూ “శతాంశునుడు” పరిపాలనలో ధర్మవర్తునులై సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు.
మహారాజు గారి భార్య భయంకరమైన దీర్ఘకాల వ్యాధితో నరకయాతన పడుతుంది. తన భార్య బాధను చూసి మహారాజు గారు కన్నీరు మున్నీరు గా విలపిస్తూ కృంగి పోతుండేవారు. చెయ్యని వైద్యం లేదు వాడని మందులేదు. అయినా మహారాజు ప్రయత్నాలు మాన లేదు.
“ఒక రోజు భటులను పిలిచి మీరింత వరకు వెళ్ళని రాజ్యాలు, ప్రదేశాలు వెళ్ళి అక్కడున్న వైద్యులను వెంటబెట్టుకొని రండి “అని ఆజ్ఞాపించాడు.
అటులనే మహారాజా !
అని భటులు రాజాజ్ఞను శిరసావహించి హుటా హుటున బయలుదేరి దేశ సంచారన చేసుకుంటూ…. ఒక ఊర్లోకి వెళ్ళారు.
అక్కడ మూలిక వైద్యంతో ఎలాంటి రోగాన్నైనా నయం చేయగల వైద్యనిపుణుడు ఉన్నాడని ఆ నోటా ఈ నోటా తెలుసుకొని అతన్ని కలిసి తమ వెంట బెట్టుకొని రాజుగారి వద్దకు తీసుకొ స్తారు.
ఆ వ్యక్తి కర్ర ఊత బట్టుకొని ఊగుకొంటూ…. ఊగుకొంటూ…. నడుస్తూ…. పళ్ళూడి పోయి, జుట్టు అంతా పండిపోయి,వృద్ధుడులా ఉన్నాడు.
“రాజుగారు ఆయన్ని చూసి తాతా…. నువ్వు చూస్తే చాలా వృద్ధుడివి మరి రాణి గారి జబ్బును నయం చేయగలవా? అని సందేహంగా అడిగారు “.
“ప్రభూ!నేను ప్రయత్నిస్తాను. నావల్ల కాకపోతే మా తండ్రిగారిని పిలిపించండి. ”
అయన నా కన్నా అనుభవజ్ఞుడు.తప్పకుండా చేయగలడని నిస్సంకోచంగా సమాధానమిచ్చాడు.
తన వద్ద ఉన్న వనమూలికలను ఉపయోగించి ఎన్ని రకాలుగావైద్యం చేసినా…. రాణి గారికి జబ్బుతగ్గలేదు. రాజుగారిలో దిగులు ఎక్కువైంది.
వెంటనే ఆ వైద్యుడి తండ్రిని పిలిపించారు. అయన కర్ర ఊత లేకుండా…. నడుచుకుంటూ వస్తున్నాడు. మరియు పళ్ళుకూడా ఊడలేదు. కానీ శరీరం చిన్నగా వణుకుతుంది.
అక్కడక్కడ తల పండింది. చూడ్డానికి తన కొడుకు కన్నా చిన్న వాడిలా ఉన్నాడు.
ఈ వైద్యుడు కూడా తన అనుభవాన్ని అంతా ఉపయోగించి వైద్యం చేసినా….. రాణిగారి వ్యాధి నయం కాలేదు. రాజు గారి ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో తనను తానే నిందించుకొని మధనపడుతున్న సమయంలో ఆ తండ్రివైద్యుడు వచ్చి….
“మహారాజా ! మీరేమి బాధ పదవొద్దు నాకన్నా అనుభవం, నైపుణ్యం, తిరుగులేని హస్తవాసం మా తండ్రి గారిది ఆయన్ని పిలిలించండి”.రాణి గారి జబ్బు తప్పక నయమవుతుంది. అని సలహా ఇచ్చాడు.
“శతాంశనుడు “మనసులో వీళ్ళుకే అంతుచిక్కని రోగం ఆయన మాత్రం ఎలా నయం చేయగలడు. అని లోలోపల సందేహిస్తూనే…
ఆతండ్రికి తండ్రిని పిలిపించాడు. ఆ మూడో తరం వైద్యుడు వచ్చాడు.
“ఆయన్ని చూడగానే రాజుతో సహా అందరూ నిర్ఘాంతపోయారు”.ఊత కర్ర లేదు, జుట్టు ఒక్కవెంట్రుక కూడా నల్ల బడలేదు ఒక్కపన్ను కూడా ఊడలేదు. పైగా శరీరం నిగ నిగ లాడుతూ….. ఎక్కడా ముడతలుగాని, ముసలి ఛాయలు గాని కనబడలేదు. చూడ్డానికి తన కొడుకు, మనవడు కన్నా అరోగ్యాంగా, దృఢంగా ఉన్నాడు.
అతన్ని చూడగానే రాజుగారిలో చిన్న ఆశ చిగురించింది. ఆ తాత వైద్యుడు
రాణిగారి పరిస్థితి చూసి ఒక్క క్షణం అలోచనలో పడి తన సంచిలోని రెండు మూలికలను తీసి నూరి రాణిగారి శరీరమంతా పూయమని, ఇంకొక సీసాలోనోని మందును రాణిగారికి పట్టించమని చెప్పాడు. అలా అలా కొన్ని రోజులకు రాణిగారి జబ్బు పూర్తిగా నయమయిపోయింది.
“రాజుగారు పట్టలేని ఆనందంతో అద్భతం అత్యద్భుతం మూలికా వైద్యానికి ఇంత మహాత్యముందా!
అని ఆ వైద్యుడిని ప్రశంసిస్తూ…. కృతజ్ఞతతో ఆ ముగ్గురు వైద్యులను పిలిపించి విలువైన బహుమతులు, డబ్బు, బంగారంతో సత్కరించి.
“వైద్య శ్రేష్టా !మనసులో ఒక సందేహం. మీ కన్నా మీ కొడుకు, మనవడు వృద్ధుల్లా కనిపిస్తున్నారు “.దీని రహస్యమేమిటో తెలియజేయగలరా?
అప్పుడు ఆ తాత వైద్యుడు “ప్రభూ ! కాలంతో పాటు ఆహారపు అలవాట్లు, పంటల్లో మార్పులు వచ్చి మానవుల శరీర అవయవాల్లో కూడా మార్పులు సంభవిస్తున్నాయి”.
నీరు గాలి ఆహారం అన్నీ కలుషితమే….. మా కాలంలో ఉన్నంత నాణ్యత, ఇప్పుడు లేదు మేము అన్నీ సహజ సిద్ధమైన, ఆరోగ్యమైన ఆహారాన్ని తినేవాళ్ళము. ఇప్పుడు మీరంతా నిస్సారమైన పంటలతో, కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్నారు. అని సున్నితంగా సమాధానమిచ్చాడా వైద్యుడు.
అప్పటి నుండి రాజుగారు ఆ తాత వైద్యుడిని “ఆస్థాన వైద్యుడుగా, నాణ్యమైన, సారవంతమైన పంటలను ఎలా పండించాలో ప్రజలకు సలహాలు, సూచనలు ఇచ్చే సలహాదారునిగా” నియమించారు.
———–సమాప్తం ——–