సాహితీ ప్రపంచాన ఏకవీరుడు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: చంద్రకళ. దీకొండ
వచన కవిత వినాపలు సాహితీ ప్రక్రియలు రచించిన పాండిత్య ప్రతిభ. “చెలియలి కట్ట” కట్టలేని రచనా వైదుష్యం. “వేయి పడగలు” గా విలసిల్లిన సాహితీ సంపద. భారత దేశ సంస్కృతీ సాంప్రదాయాలకు కల్పించెను “రామాయణ కల్పవృక్ష” నీడ!
“ప్రకటింపబడిన సంఖ్య ఇరవై వేలైతే, చింపి పడవేసినవి యాభై వేలుగా” అనితరసాధ్యమైనది ఆతని రచనా శక్తి. “వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, స్వరంలో, భావంలో, భావనలో, దర్శనంలో విమర్శనంలో, భాషణంలో, భూషణంలో వైలక్షణమైనది” అతని వ్యక్తిత్వం, ద్వందాలకు అతీతుడు.” అపూర్వమైన దినుసతడు! ప్రౌఢ భాషతో కూడిన రచనా శైలీ, ఉత్సుకతను రేకెత్తించే కథా కథన శిల్పం. చదివేవి ఆంగ్ల గ్రంథాలు, వ్రాసేవి ఆంధ్ర సంస్కృతాలు”. వ్యవహార భాషలో కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి రచించిన సవ్యసాచి, ఋతు వర్ణనలలో మేటి! గురువు చెళ్లపిళ్లకే గౌరవం ఇనుమడింపజేసినది అతని శిష్యరికం, తాను మహాకవిని కావడానికి మూలమని తెలుపుచూ సతి వరలక్ష్మి వియోగబాధతో రచించెను “వరలక్ష్మి త్రిశతి”. “బహు విచిత్ర చిత్రధ్వని బహువిచ్ఛిత్తిమ్మహాకృతి, ప్రణీత సత్యనారాయణ కవి” అని స్వయంగా చాటుకున్నది. ఆయన ఆత్మవిశ్వాసం! రోజుకో పేజీ చొప్పున ఆశువుగా చెప్పుచుండగా. వేయి దినములలో ఆతని కుమారునిచే విరచితమైన “వేయిపడగలు” నవలలో “గిరిక, పసరిక పాత్రలచే పైరు పచ్చదనానికి గొడుగుపట్టి, ధర్మమయ తనువు నాలుక యందు శూలము కలిగి. కరుణ తరంగితాంతరంగుడై. సంప్రదాయాలను మాయం కాకుండా కాపాడినవాడు”!
“మాట్లాడే వెన్నెముక.
పాట పాడే సుషుమ్న.
నిన్నటి నన్నయభట్టు.
నేటి కవిసామ్రాట్టు
గోదావరి పలుకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగు వాడి గోల్డ్ నిబ్బు
అకారాది క్షకారాంతం
ఆసేతు మహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగువాడి ప్రకాస్తి.”
అని శ్రీశ్రీ చే ప్రశంసించబడినవాడు! జగమెరిగిన తొలి జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, గౌరవ డాక్టరేట్లకే గౌరవం తెచ్చిన సాహితీప్రపంచ “ఏకవీరుడతడు!”