అమ్మంటే అంతే
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
సమీక్షకులు: సావిత్రి తోట “జాహ్నవి”
కథ: “అమ్మంటే అంతే”
రచన: పి. ఎల్.ఎన్.మంగారత్నం
సహారి అంతర్జాల పత్రికలో 3/9/2021 తేదిన ప్రచురించిన కథ “అమ్మంటే అంతే!” రచయిత్రి
పి. ఎల్.ఎన్.మంగారత్నం గారు.
చదువు కోసం దూరంగా వెళ్తున్న ప్రతి ఆడపిల్ల తెలుసుకోని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలంటే, సహారి అంతర్జాల పత్రికలో 3/9/2021 న ప్రచురించిన పి.ఎల్.ఎన్.మంగారత్నం గారు రచించిన “అమ్మంటే అంతే!” కథ చదివి తీరవలసిందే. ఆడపిల్లలు ఉన్న ఈనాటి తల్లిదండ్రుల ఆలోచనధోరణిని ప్రశ్నించి, వారిలో ధైర్యం పెంచే ఉద్దేశమే ఈ కథ. రోజుకో చోట ప్రేమ పేరుతో జరిగే ఆత్యాచారాలు, బ్లాక్మెయిలింగ్, సోషల్ మీడియాలలోను, వార్తలలో చూస్తున్న విషయమే. దానినే ప్రధాన ఆంశంగా తీసుకుని, రచయిత్రి తనదైన బాణీలో హృద్యంగా చిత్రించారు. తండ్రిలేని బిడ్డ కోరిక మేరకు తన తహత్తుకు మించిన పని అయిన టౌన్కు పంపించి, ఇంటర్ చదివిస్తున్న తల్లి, కూతురు అర్థాంతరంగా ఆత్మహత్య ఎందుకు చేసుకుందో తెలిసేసరికి, భరించలేక, ప్రేమ పేరుతో లోబరుచుకుని, బ్లాక్మెయిల్ చేస్తున్న దుర్మార్గుడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి కథ ఇది.
తరచు ఎక్కడో చోట రోజు చూస్తున్న సంఘటన తన కూతురు ఆత్మశాంతి కోసమే కాకా, తన కూతురు లాంటి మరో ఆడపిల్ల ఎవ్వరూ బలైపోకూడదన్న కృతనిశ్చయంతో, అస్సలు దోషి వివరాలు తెలియక పోయిన సరే, కూతురి ఫోన్లో దొరికిన ఒక ఫోన్ నంబర్ ఆధారంతో ఊరివారి, మహిళ సంఘాల సాయంతో పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కి, కేసు వేసింది ఆ తల్లి. అలా కోర్ట్ కి వెళ్లిన కేసు, అడుగడుగున ఒక తల్లి, ఒక లాయరు పట్టుదల, ఇద్దరు లాయర్ల స్వార్థాల మధ్య నలిగిపోతూ… చదువుతున్న ఆ కాస్సేపటిలో పాఠకులలో చివరికి ఏమవుతుందన్న ఉత్కంఠ రేక్కేత్తిస్తుంది. చివరికి హైకోర్ట్ కూడా ఆ దోషికి ఉరిశిక్ష వేయడంతో, మరోకరు ఆడపిల్లలను మోసం చేయడానికి భయపడే పరిస్థితి కల్పించడం ద్వారా, ఈ కథ కొంత వరకు ఆడపిల్లల తల్లిదండ్రులలో దైర్యం నింపిదని చెప్పవచ్చు.