నాలోని నీకు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సావిత్రి తోట “జాహ్నవి”
నాలోని ప్రాణమా!
నా జీవన నాధమా!
ఎలా చెప్పను… ఏమని చెప్పనూ!? నాలోని నీకు!
అనుక్షణం వెంట వెంట ఉండి హెచ్చరిస్తూనే ఉంటావు! నా ఉనికిని నాకు తెలియచేస్తూనే ఉంటావు! లోకం పోకడ ఎరగని నాకు నీవే లోకమై నా రక్తంలో చేరి ప్రవహిస్తూనే ఉంటావు!
నీవు లేని ఈ లోకం స్తంభిస్తుంది నాకు.
భయంకర ఒంటరితనంతో నైరాశ్యం లో కురుకుపోతూ… నాలో చెల్లరేగుతున్న పిరికి ఆలోచనలను తుదముట్టించి.
నా తోడు నీడై నిలిచి, నీకు నేనున్నానంటు నన్ను ఓదార్చి, నీ దారిలోకి మళ్లించుకుని, మానసీక సాంత్వన కలిగించావు. ఈ రోజు నా మది నిండా ఆత్మవిశ్వాసంతో, నేనోక రచయితనై, నలుగురిలో గుర్తింపు పొందానంటే అది నీవు పెట్టిన భిక్షే! కాదని ఎలా అనగలను!? తోడుగా దరిచేరి, నా జీవనంలో భాగమై, ఒక క్షణం నీవులేని నన్ను ఊహించడానికి కూడా సహించలేని భయంకర వ్యసనంగా మారిపోయావు! అక్షరాభ్యాసం నాడు నా చెంత చేరి, పెళ్లి, పిల్లలు అనే బంధాలతో దూరమై, మరల ఈనాటికి ఆత్మీయ ఆలింగనంతో చేరువైన నిన్ను నాలో ప్రాణం నిలిచి ఉన్నంత వరకు వదలనే వదలను. అనుక్షణం నీ నీడ నాలో ఆలోచనలకు రూపునిస్తూనే ఉంటుంది.
నా ప్రియ నేస్తమా!
ఏమని సంభోదించను నిన్ను!
నాలో నిలిచిన జ్ఞాపకమా!!
ఇన్నాళ్లు మెదడు అట్టడుగు పోరలలో దాగి, అనుక్షణం నన్ను వెంటాడే ఆలోచనా!!
నాలో నాకే తెలియని అజ్ఞానమా!
ఏమి తెలియని నేను అని తెలుసనుకుంటూ.
వీర్రవీగేవేళ పక్కున నవ్వే జ్ఞానమా!
అమ్మ ఓడిలో నేర్చుకున్న కమ్మని మాతృభాషవా!
నా ఆలోచనకు ఒక రూపునిచ్చే అక్షరమా!
ఏమని సంభోదించను నిను!
ఏదేమైన కాని, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నిను విడిచి ఉండేనే లేదు.
ఇట్లు
నాలోని నీకు