(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)
నయవంచన
రచయిత:జె వి కుమార్ చేపూరి
పరిమళమెరుగనిది నేటి మానవత్వం
ప్రసార మాధ్యమాలకే అది పరిమితం
అవకాశాన్ని దోచుకోడం దాని నైజం
మమత, మానవతలకు తిలోదకం
మేకవన్నె పులిలా పేరుకు పోయిన
జాడ్యం, విస్తరించె చాపకింద నీరులా
బడాబాబుల బహిరంగ దందాలా
యధేచ్చగా, నాయకుల కనుసన్నల
ఆదాయ వనరుల ముసుగున
అనాధ శరణాలయాల స్థాపన
వృద్దాశ్రమాల మాటున ధనార్జన
సేవా సంస్థల పేరున సంపాదన
విద్య పేరుతో నిలువు దోపిడీ
సన్మానాల పేరుతో బురిడీ
అంతులేని అధికార దాహాలు
అర్హులకందని ఉపకార ఫలాలు
ఊపిరందక ఉసురులు ఆగుతుంటే
ప్రాణవాయువు దాచి దోచే దొంగలు
అన్నము కరువై పెట్టే ఆకలి కేకలు
చీకటి వ్యాపారానికి తెరుస్తాయి తెరలు
పళ్లకై (దంతాలకై), తోళ్లకై, గోళ్లకై
సాటి మూగ జీవుల హత్యోదంతం
వైద్యం ముసుగున దోపిడీ రాజ్యం
ఆడవారి శీలాలతో అక్రమార్జనం
లెక్క చూపనవసరం లేని ఆర్జన
సర్కారు రాబడికి గండి కొట్టే యోచన
మానవత్వం మాటు వ్యాపారానికి
పరదా లేపే పసందైన నయా వంచన
వ్యాపారానికి మానవత్వపు ముసుగు
తొడిగినప్పుడు విలువలు మరుగు
కఠిన శిక్షలతోనే అవి తెరమరుగు
సామాన్యుల వెతలప్పుడు తొలగు..!